చిత్తూరు జిల్లా గంగవరం (మం) కీలపట్ల గ్రామంలో వెలసిన శ్రీ కోనేటిరాయ స్వామి దేవాలయం అతి పురాతనమైన చారిత్రక ప్రసిద్ధి కలిగిన దేవాలయం. ఈ స్వామి వారిని భృగు మహర్షి ప్రతిష్ట చేసి ఆరాధించగా, పాండవ మధ్యముడు అర్జునుడి ముని మనవడు జనమేజయ మహారాజు గుడి కట్టించారు. తర్వాత కాలంలో చోళ, పల్లవ, విజయనగర సామ్రాజ్యాధీశుల ఏలుబడిలో విశేష పూజలు అందుకుని తర్వాత మహమ్మదీయుల దండయాత్రలకు భయపడి గ్రామస్తులు స్వామి వారిని కోనేటిలో దాచి ఉంచారు.
ఆ తర్వాత కాలంలో చంద్రగిరి సంస్థానాధీశుల సామంతులు శ్రీ బోడికొండమ నాయుడు గారికి కలలో సాక్షాత్కరించి కోనేటిలో ఉన్న స్వామివారిని తిరిగి ప్రతిష్టించమని కోరినారు. ఆ విధంగా కోనేటి నుండి ప్రతిష్ట చేయబడి శ్రీ కోనేటి రాయ స్వామిగా ప్రసిద్ధి చెందినారు. అన్నమయ్య కీర్తనలలో శ్రీ కోనేటిరాయ స్వామి ఆలయం ఈ గ్రామంలో మాత్రమే ఉన్నది. కోరినదే తడవుగా కొండంత వరములను ప్రసాదించే శ్రీ కోనేటిరాయ స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీ వైఖానస ఆగమోక్త ప్రకారముగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.