
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రవణం విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ సోమవారం సాయంత్రం శ్రవణం కేంద్రాన్ని, చిన్నారుల శిక్షణ తరగతులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ.. శ్రవణం కేంద్రంలోని విద్యార్థుల సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, చిన్నారులకు ప్రధాన సౌకర్యాలను త్వరలో కల్పిస్తామన్నారు.
చిన్నారులు ఉంటున్న భవనం అక్కడక్కడా వర్షా కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ భాను ప్రకాష్ రెడ్డి తమ దృష్టికి తీసుకువచ్చారని, త్వరలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. చిన్నారులకు వినికిడి యంత్రాలు సరఫరా చేయాలని, మరింతగా పౌష్టికాహారం అందించాలని వారి తల్లులు కోరారు. శ్రవణం భవణంలో అక్కడక్కడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, తక్షణమే సాంకేతిక అంశాలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ జి.భానుప్రకాష్ రెడ్డి, జేఈవో శ్రీమతి గౌతమి, శ్రవణం ఇన్ఛార్జి డా.పి.కిషోర్ కుమార్, టీటీడీ ఎస్ ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఏవీఎస్వో మోహన్ రెడ్డి, శ్రవణం ప్రెసిడెంట్ శ్రీమతి ఎన్. కనకదుర్గ, సెక్రటరీ శ్రీమతి పుష్పలత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
