Site icon Bhakthi TV

పీఏసీ-5లో భవన నిర్మాణ పనుల పురోగతిపై టీటీడీ సమీక్ష

తిరుమలలో టీటీడీ నిర్మిస్తున్న నూతన యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ-5) భవన నిర్మాణ పనుల పురోగతిపై టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి మంగళవారం అన్నమయ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఈవోకు ఇంజినీరింగ్ అధికారులు నిర్మాణ పనుల స్థితి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో భాగంగా 16హాళ్లలో 8 హాళ్లలో ఫ్లోరింగ్ పూర్తైందని, మిగిలిన పని చేయాల్సి ఉందని చెప్పారు. అనంతరం అడిషనల్ ఈవో మాట్లాడుతూ త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి ఒక్క పనికి గడువు నిర్దేశించుకుని పనుల వేగవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. భవనంలో భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు నాణ్యతలో రాజీ పడకూడదన్నారు. అదేవిధంగా పీఏసీ-5లో భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న అన్న ప్రసాదం డైనింగ్ హాల్, కళ్యాణ కట్ట, డిస్పన్సరీ సదుపాయాలపై కూడా అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీ భాస్కర్, శ్రీ వెంకటయ్య, శ్రీమతి ఆశాజ్యోతి, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వేంకటేశ్వర్లు, ఈఈలు శ్రీ వేణు గోపాల్, శ్రీ సుధాకర్, ఎలక్ట్రికల్ డిఈ శ్రీ చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూదన్ ప్రసాద్, అశ్వినీ ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version