Site icon Bhakthi TV

శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయం స్కీం వివరాలు చెప్పిన టీటీడీ ఈవో

తిరుపతిలోని శ్రీపద్మావతీ చిన్నపిల్లల హృదయాలయంలో చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవల దృష్ట్యా టిటిడిలో కొత్తగా ఓ ట్రస్ట్ ఏర్పాటుపై సాధ్యాసాద్యాలను పరిశీలించాలని టిటిడి ఈవో జె.శ్యామల రావు అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి నిర్వహణపై అధికారులతో ఆసుపత్రి సమావేశ మందిరంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీ పద్మావతీ చిన్న పిల్లల హృదయాలయంలో ఇప్పటికే శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయం స్కీం ఉందని, ఈ స్కీం క్రింద రూ.1 లక్ష దాత విరాళం అందిస్తే నిరాదరణకు గురైన పేద వర్గాలకు చెందిన ఒక పిల్లవాడికి ఉచితంగా ఆపరేషన్ చేసే సదుపాయం ఉందన్నారు. టీటీడీలో ఇప్పటికే ఉన్న పలు ట్రస్ట్ తరహాలో నూతనంగా చిన్నపిల్లల వైద్య సేవల కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుకు సంబంధించిన నియమ నిబంధనలపై నివేదిక తయారు చేయాలని అన్నారు.

చిన్న పిల్లలను దైవ సమానులుగా భావించి, ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే పసి బిడ్డలకు చక్కటి వైద్య సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు. పిల్లలకు సంబంధించి గుండె చికిత్సలతో పాటు చిన్న పిల్లల గుండె సర్జరీల సంఖ్యను పెంచేందుకు అవసరమైన వైద్య పరికరాలు, మౌళిక సదుపాయాలు, అత్యవసర మందులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నూతన భవన నిర్మాణం తాజా పరిస్థితిపై ఆయన ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష చేసి తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అటు తర్వాత చిన్న పిల్లల ఐసియూ బ్లాక్, జనరల్ వార్డు, ఓపి బ్లాక్ లోని పిల్లలకు అందుతున్న వైద్యసేవలపై వైద్యులను, పిల్లల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తల్లి తండ్రులు ఆసుపత్రి లో అందుతున్న వైద్య సేవలపై తమ సంతృప్తిని ఈవోకు తెలియజేశారు.

Share this post with your friends
Exit mobile version