Site icon Bhakthi TV

వారి కామెంట్స్‌కి స్పందించాల్సిన అవసరం లేదనే ఆ వ్యాఖ్య: టీటీడీ చైర్మన్

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు సోషల్ మీడియాలో కామెంట్స్‌పై స్పందించారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌కు తన వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదని టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అన్నారు. తన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించినవి కాదన్నారు. మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పానన్నారు. ముఖ్య‌మంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలకమండలి క్షమాణలు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. సోషల్ మీడియాలో ప్రతిఒక్కరి కామెంట్స్‌కి స్పందించాల్సిన అవసరంలేదనే ఉద్దేశంతోనే ఈ విధమైన వ్యాఖ్య చేసినట్టు చైర్మన్ తెలిపారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు, బాధిత కుటుంబాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు కోరారు. తను మాత్రమే కాకుండా ఘటనపై టీటీడీ ఛైర్మన్, ఈవోలు కూడా క్షమాపణలు చెప్పాలన్నారు. అయితే జరిగిన ఘటనపై టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ.. తప్పు జరిగిందనీ.. క్షమాపణ చెప్తే చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేం కదా అని అన్నారు. జ్యుడిషియల్ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఎవరో ఏదో చెప్పినదానికి తాము స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఆ వ్యాఖ్యలు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే చేశారని చెబుతున్నారు.

Share this post with your friends
Exit mobile version