
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 28 నుండి జనవరి 7వ తేది వరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో భక్తులకు ఇచ్చే SSD టోకెన్ల జారీని రద్దు చేయడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించవలసిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు మార్గదర్శకాలు 30.12.2025 నుంచి 08.01.2026 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో అమల్లో ఉంటాయి.
తొలి మూడు రోజులు అనగా, డిసెంబర్ 30, 31, జనవరి 01వ తేదీల్లో ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం అవకాశం ఉంటుంది. టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీలలో నిర్దేశించిన సమయానికి (Time Slot) మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాల్సి ఉంటుంది. టీటీడీ ప్రజా సంబంధాల విభాగం,ఎస్వీబీసీ, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పపడు అందించే భక్తుల రద్దీ సమాచారం ఆధారంగా టోకన్లు లేని భక్తులు జనవరి 02వ తేదీ నండి 08వ తేదీ వరకు సర్వ దర్శనం క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం పొందడానికి తమ ప్రణాళికను రూపొందించుకోవలసినదిగా కోరడమైనది.
