![]()
వేంకటపతి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగవరోజు రాత్రి జరిగిన సర్వభూపాల వాహన సేవలో 19 కళాబృందాలు 507 మంది కళాకారులు సర్వాంతర్యామి అయిన కొండలరాయుడిని గానాలతో, వాద్యాలతో, నృత్యాలతో కీర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఛత్తీస్ఘడ్ వంటి 10 రాష్ట్రాల నుండి వచ్చిన కళా బృందాలు ప్రదర్శించిన తీరు భక్తులను సంబ్రమాశ్చర్యాలతో భక్తిరసాన్ని నింపాయి. ఇందులో తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన డా. శరత్ చంద్ర బృందం సర్వభూపాల వాహన సేవ రూపకం, హారిక బృందం కూచిపూడినృత్యం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజ్యలక్ష్మి బృందం భరతనాట్యంతో భక్తులను ఆకట్టుకున్నారు.
కొండా సాయినాథ్ బృందం గిరిజన నృత్యం, తెలంగాణకు చెందిన జోత్స్న బృందం దశావతార వైభవం రూపకంతో, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మయాంక్ తివారి బృందం నౌరట్ నృత్యం, పుదుచ్చేరికి చెందిన బాల గురునాథన్ బృందం కుమ్మి నృత్యంతోను, మహారాష్ట్రకు చెందిన శ్రీ కథీకర్ బృందం డ్రమ్మువిన్యాసాలు భక్తులను మంత్రముగ్ధులను చేసింది. రాజంపేటకు చెందిన శ్రీదేవి బృందం, తిరుమలకు చెందిన శ్రీనివాసులు బృందం కోలాటాలతోను, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎస్.దివ్యశ్రీ బృందం నందనందన పాహి అనే నృత్య విన్యాసంతోను, అనంతపురం జిల్లాకు చెందిన శారద బృందం జానపద నృత్యం, రాజమండ్రికి చెందిన రాణి బృందం కేరళ డ్రమ్స్తో, గుజరాత్ రాష్ట్రానికి చెందిన తేజస్ యాదవ్ బృందం పంగట్ నృత్యంప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కర్ణాటకకు చెందిన సతీశ్ రామానుజన్ బృందం కోలాటం, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గౌతమ్ కార్ధే బృందం గిరిజన జానపద నృత్యం, తమిళనాడుకు చెందిన నిశాంత్ బృందం గొరవరకునిత నృత్యం, పంజాబ్ రాష్ట్రానికి చెందిన హరిదీప్ సింగ్ బృందం బంగ్రా నృత్యం, చత్తీస్ ఘడ్ కు చెందిన రిషికాంత్ గుప్తా బృందం బస్తర్ గిరిజన జానపద నృత్యం భక్తులను ఎంతగానో అలరించాయి.
