Site icon Bhakthi TV

హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం ఉదయం 7 గంటలకు శ్రీ‌ గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. త్రేతాయుగంలో రామభక్తునిగా ప్రసిద్ధిగాంచినవాడు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్త్వాన్ని బోధించినట్టు ప్రాచీనవాఙ్మయం నుండి తెలుస్తోంది.

బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి. శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు. అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు వసంతోత్సవం వైభవంగా జరగనుంది. అనంతరం శ్రీవారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

గ‌జ వాహ‌నంపై శ్రీ గోవిందరాజస్వామి అభ‌యం

శనివారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ గోవిందరాజస్వామివారు గ‌జ వాహ‌నంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. హైందవ సనాతన ధర్మంలో రాజసానికి, రణరంగంలో గానీ, రాజదర్బారులో గానీ, ఉత్సవములలో గానీ గజానిదే అగ్రస్థానం. సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్టవాహనం అయిన గజవాహనం స్వామివారికి వాహనంగా విశేష‌ సేవలు అందిస్తోంది.

Share this post with your friends
Exit mobile version