Site icon Bhakthi TV

వైభవంగా శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం

శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం శ్రీవారి మెట్టు సమీపంలో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. అనంతరం నిన్న పార్వేట ఉత్సవం జరిగింది. దీనిలో భాగంగా ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు.

ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఏఈఓ శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయలు, శ్రీ వెంకట స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version