Site icon Bhakthi TV

పుష్పక విమానం ద్వారా వచ్చే సీతారాములకు ఆహ్వానం పలకనున్న సీఎం

అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత జరుగుతున్న తొలి దీపావళి కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే సరయూ నదీ తీరంలో దీపోత్సవం జరుగనుంది. ఇక్కడి సరయూ నదీ తీరంలో ఉన్న 55 ఘాట్లలో అత్యంత కీలకమైనది రామ్ కథా పార్క్. దీని వద్ద పుష్పక విమానంలో హనుమంతుడితో కలిసి సీతారాములు, లక్ష్మణుడితో వస్తారు. హెలిప్యాడ్ వద్ద సీఎం యోగి, గవర్నర్‌ సహా కేంద్రమంత్రులు శ్రీరాముడికి రామ్‌నగరిలోకి రమ్మంటూ ఘనంగా స్వాగతం పలుకుతారు. అంతేకాకుండా రామ్ కథా పార్కులో రాముడి రథాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు లాగనున్నారు.

ఈ కార్యక్రమానంతరం శ్రీరాముని పట్టాభిషేకం సైతం ఇక్కడే నిర్వహించనున్నారు. దీపోత్సవ కార్యక్రమానంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు ప్రసంగించనున్నారు. సాయంత్రం 6:15 గంటలకు ముఖ్యమంత్రి యోగి రామ్‌కథా పార్కు నుంచి సర్జూ ఘాట్‌కు చేరుకున్న అనంతరం సరయూ నదికి పాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత సరయు మహా హారతిలో పాల్గొంటారు. 25 లక్షలకు పైగా దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు సన్నాహాలు నిర్వహిస్తున్నారు. అనంతరం రామ్ కీ పౌరిలో అద్భుతమైన లేజర్ షో, సౌండ్ షో కూడా ప్రదర్శించనున్నారు.

Share this post with your friends
Exit mobile version