
ఏఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలయ నమూనాల రూపకల్పన పోటీలు జరిగాయి. సప్తసింధు-2025 పేరిట హైదరాబాద్ టి-హబ్లో తాజాగా కళాశాల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించారు. “ఆలయ నమూనాల రూపకల్పన పోటీలు – ప్రదర్శన” పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో గౌరవ అతిథిగా ద్విసహస్రావధాని పద్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ విచ్చేశారు. ఈ సందర్భంగా మన భారతీయ దేవాలయాలు, వాటిలోని శిల్పసంపద ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోందని.. మన సంస్కృతి, సంప్రదాయం, జీవితానికి ఆటపట్టు దేవాలయమేనని అన్నారు.
ఇక పోటీల్లో మూడు నమూనాలు తొలి మూడు బహుమతులను గెలుచుకున్నాయి. తొలి బహుమతిని కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ విద్యాశంకర ఆలయం నమూనాను రూపొందించి జోగినపల్లి భాస్కర్ రావు ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థి బృందం గెలుచుకుంది. తొలి బహుమతిగా వీరు రూ.50 వేలు గెలుచుకున్నారు. రెండవ బహుమతిగా రూ.30 వేలను గుజరాత్ రాష్ట్రం మొతేరాలోని సూర్యదేవాలయం నమూనాను తయారు చేసిన శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థి బృందం గెలుచుకుంది. మూడవ బహుమతిగా రూ.20 వేలను తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ రామప్ప ఆలయ నమూనాను ప్రదర్శించిన హైదరాబాద్ జేఎన్ఎఫ్ఏయూ విద్యార్థి బృందం గెలుచుకుంది.
