Site icon Bhakthi TV

సింహ వాహనంపై యోగ నరసింహ స్వామి అలంకారంలో శ్రీనివాసుడు

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున వివిధ వాహన సేవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ యోగ నరసింహ స్వామి అలంకారంలో సింహ వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు నిరూపించారు.

Share this post with your friends
Exit mobile version