
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. కాగా అర్ధరాత్రి 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు.
ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. ఉదయం 8 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుండి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధం, పన్నీరు, విభూదితో స్నపనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
