Site icon Bhakthi TV

పెద్దశేష వాహనంపై వైకుంఠనాధుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. వేసవి కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ముందుగానే అన్ని ఏర్పాట్లనూ నిర్వహించింది. శుక్రవారమే అంకురార్పణతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక మొదటి రోజు అంటే శనివారం రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వైకుంఠనాధుడి అలంకారంలో భక్తులను క‌టాక్షించారు. వాహన సేవకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారికి అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు.

ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈఓ శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఆలయ అర్చకులు , శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version