నారాయణవనం మండల కేంద్రంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లి సమేత శ్రీ అగస్తీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 21 నుంచి భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 30వ తేదీ వరకూ ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ ఏప్రిల్ 20వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు గణపతి పూజ, అంకురార్పణం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది.
అదే రోజు రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల మధ్య స్నపన తిరుమంజనం, రాత్రి 7.30 గంటలకు వాహనసేవలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వాహన సేవల విశేషాలు (ప్రతి రోజు రాత్రి 07.30 గం.లకు )
ఏప్రిల్ 22 – సింహ వాహనం
ఏప్రిల్ 23 – హంస వాహనం
ఏప్రిల్ 24 – శేష వాహనం
ఏప్రిల్ 25 – నంది వాహనం
ఏప్రిల్ 26 – గజ వాహనం
ఏప్రిల్ 27న రాత్రి 07.30 గం.లకు రథోత్సవం కన్నులపండువగా నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 28న రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవం, అనంతరం అశ్వవాహన సేవ జరుగుతుంది.
ఏప్రిల్ 29న ఉదయం 9 గంటలకు శ్రీ నటరాజస్వామివారి వీధి ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం రావణాసుర వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.
ఏప్రిల్ 30న కైలాసకోనలో త్రిశూలస్నానం ఘనంగా నిర్వహించి, రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
