Site icon Bhakthi TV

తెలంగాణలోని ఈ సీతారామాలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి..

మనమంతా కాలంతో పాటు పరుగెడుతూ మన చుట్టూ ఎన్నో వింతలు, విశేషాలను చూడలేకపోతున్నాం. చరిత్రకు సజీవ సాక్ష్యాలు ఉన్న వాటి గురించి తెలుసుకోలేకపోతున్నాం. అలాంటి వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి. దాదాపు ఏడువందల ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం ఇది. వందల ఏళ్లైనా చెక్కు చెదరని నిర్మాణాలు దీని సొంతం. ఎక్కడా లేని విధంగా 700 ఏళ్లుగా నిరంతరం వెలుగుతున్న అఖండజ్యోతి ఈ ఆలయం ప్రత్యేకత. నిజాం పాలనలోనూ నిర్విగ్నంగా పూజలు సాగిన ఆలయమే.. తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేటలోని అతి పురాతనమైన సీతారామాలయం.

తెలంగాణ ప్రాంతాన్ని అనేక రాజ వంశాలు పరిపాలించాయి. వారి పాలనకు గుర్తులుగా ఆయా ప్రాంతాల్లో పలు దేవాలయాలను అప్పటి రాజులు నిర్మించారు. అలాంటి ఆలయాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని అతి పురాతనమైన సీతారామాలయం ఒకటి. కాకతీయ పాలకుల కాలంలో దాదాపు క్రీస్తు శకం 1333లో నిర్మితమైన ఈ దేవాలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో పురాతన లక్ష్మణ సమేత సీతారాముల మూల విగ్రహలతోపాటు 16 రాతి స్తంభాలతో నిర్మించిన కళ్యాణమంటపం, గంట, తటాకం నాటి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆలయంలోని గంటపై ఆలయ నిర్మాణానికి సంబంధించిన సంవత్సరం చెక్కబడి ఉంది.

ప్రతాపరుద్రుని కాలంలోనే నిర్మాణం
ఓరుగల్లును పరిపాలించిన కాకతీయుల రాజ్యంలో కొన్ని గ్రామాలను పాలన పరంగా ప్రత్యేక గుర్తించేవారు. అలా గుర్తించిన వాటిలో గంభీరావుపేట ప్రధాన కేంద్రంగా ఉండేది. అందుకే అక్కడ ప్రత్యేకంగా లక్ష్మణ సమేత సీతారామాలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. కాకతీయ రాజులలో చివరివాడైన ప్రతాపరుద్రుని కాలంలో ఈ సీతారామాలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. నిజాం పాలనలో లింగన్నపేట సంస్థానానికి చెందిన శ్రీ వేంకటరావు దేశాయి సంస్థానాధీశుడిగా ఉండేవాడు. ఈ ఆలయం పరిపాలన ఆయన కిందకి రావడంతో సీతారామాలయం అభివృద్దికి కృషి చేసినట్లు స్థానికులు చెబతుంటారు. ఆలయంలోని పూజ కార్యక్రమాల కోసం దగ్గర్లోనే వెంకటాద్రి చెరువును నిర్మించారు. ఆ చెరువు నుంచే ఆలయంలో జరిగే ఉత్సవాలన్నింటికీ నీటిని తెస్తుంటారు. ఇప్పటికీ ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.

Share this post with your friends
Exit mobile version