Site icon Bhakthi TV

మే 3న శ్రీ కోదండ రామ‌స్వామివారి ఆల‌యంలో పుష్పయాగం

తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో మే 3వ తేదీన పుష్పయాగం నిర్వ‌హించ‌నున్నారు. మే 2వ తేదీన సాయంత్రం పుష్పయాగానికి అంకురార్పణ జ‌రుగ‌నుంది. పుష్పయాగం సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్వామివారికి వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మే 3న ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు. అనంత‌రం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సీతా ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేస్తారు.

అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తారు. గృహస్తులు (ఇద్దరు) రూ.1,000/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు. శ్రీ కోదండరామాలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

Share this post with your friends
Exit mobile version