Site icon Bhakthi TV

శాస్త్రోక్తంగా శ్రీ కోదండ రామస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ

తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో నిన్న జరుగనున్న పుష్పయాగానికి శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు పుణ్యాహ‌వ‌చ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం నిర్వహించారు. ఇవాళ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ లక్ష్మణ సీతా సమేత శ్రీ కోదండరామ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేశారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది.

ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. రాత్రి 7 గంట‌లకు నాలుగు మాడ వీధుల్లో శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వార్లు భక్తులకు అభయమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ బి.రవి, సూపరింటెండెంట్ శ్రీ ఎం.మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎ.ఎం.సురేష్ బాబు, గుణశేఖర్ , ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version