
విజయవాడలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం మండలాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. మండలాభిషేకం అనేది ఒక పవిత్రమైన, అభిషేక స్నానోత్సవం. ఈ సమయంలో ఆలయ పూజారులు స్వామి వారికి పాలు, పసుపు, చందనం, తేనె వంటి పవిత్రమైన వస్తువులను సమర్పిస్తూ, మంత్రాలు పఠిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ట, శాంతి హోమం, అష్టోత్తర శత కలశాభిషేకం, పూర్ణాహుతితో మండలాభిషేకం ఘనంగా ముగిసింది.
ఇక ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణం నిర్వహించారు. సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అష్ట బంధన మహా సంప్రోక్షణ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో మహా సంప్రోక్షణ నిర్వహించిన విషయం తెలిసిందే. మహా సంప్రోక్షణ తర్వాత 45 రోజులకు మండలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.
