Site icon Bhakthi TV

ఒంటిమిట్ట రామాలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఒంటిమిట్ట ఏకశిలానగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

06-04-2025

ఉదయం – ధ్వజారోహణం (ఉద‌యం 9.30 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు వృష‌భ‌ లగ్నం)

రాత్రి – శేష వాహనం

07-04-2025

ఉదయం – వేణుగానాలంకారము

రాత్రి – హంస వాహనం

08-04-2025

ఉదయం – వటపత్రశాయి అలంకారము

రాత్రి – సింహ వాహనం

09-04-2025

ఉదయం – నవనీత కృష్ణాలంకారము

రాత్రి – హనుమంత వాహనం

10-04-2025

ఉదయం – మోహినీ అలంకారము

రాత్రి – గరుడసేవ

11-04-2025

ఉదయం – శివధనుర్భాణ అలంకరణ

రాత్రి – కళ్యాణోత్సవము/ గజవాహనము

12-04-2025

ఉదయం – రథోత్సవం

13-04-2025

ఉదయం – కాళీయమర్ధనాలంకారము

రాత్రి – అశ్వవాహనం

14-04-2025

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం.

ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హించ‌నున్నారు.

Share this post with your friends
Exit mobile version