
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 27న కార్తీక వనభోజన కార్యక్రమం జరుగనుంది. ఈ కారణంగా నిత్య కల్యాణోత్సవం ఆర్జిత సేవ రద్దయింది. పవిత్రమైన కార్తీక మాసంలో ద్వాదశి నాడు ఇక్కడ వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి ఉదయం 9 గంటలకు శ్రీవారి మెట్టు వద్దగల పార్వేట మండపానికి వేంచేపు చేయాల్సి ఉంది.
అయితే వర్షం కారణంగా ఆలయంలోనే వన భోజనం కార్యక్రమం నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. యథావిధిగా ఇతర కార్యక్రమాలను ఆలయంలోనే నిర్వహించనున్నారు. అక్కడ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత అలంకారం, వనభోజనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్కడి నుండి సాయంత్రం 5 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
