Site icon Bhakthi TV

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల‌లో కళానిరాజనం

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉద‌యం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన పండితులచే చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు విజయవాడకు చెందిన డాక్టర్ టి.ఆల్వార్ బృందం ధార్మికోప‌న్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన మహతి ఆర్ట్స్ మరియు శ్రీమతి లక్ష్మి బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.

అనంత‌రం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి విజయ కుమారి బృందం హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ రంగనాథ్ బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు ఊంజల సేవలో సేలంకు చెందిన శ్రీమతి మాళవికా జోషి బృందం అన్నమయ్య సంకీర్తన‌ల‌ను సుమధురంగా గానం చేశారు. అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటలకు చెన్నైకి చెందిన శ్రీ గాయత్రి వెంకటేష్ గాత్రం, శ్రీ శైలజా కుమార్ బృందం కథాకళి, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి శంకరి నాట్యశాలకు చెందిన శ్రీ భరద్వాజ్ కూచిపూడి నాట్యం ప్రదర్శించారు. శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6:30 గంటలకు శ్రీ వాయునందన్ బ్రదర్స్ బృందం గాత్ర సంగీతం నిర్వహించారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి శ్రీమతి లక్ష్మీ బృందం భరతనాట్య ప్రదర్శన జరిగింది.

Share this post with your friends
Exit mobile version