
శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా ఉదయం, సాయంత్రం వాహన సేవలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణలో ఆలయ అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. గురువారం రాత్రి శ్రీ ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, శ్రీ ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై నాదస్వర, డోలు కచేరి అలరించింది. ఇందులో కళాశాల అధ్యాపకులు శ్రీ సురేష్, శ్రీ జయరామ్, శ్రీ సుదాకర్ బృందం మరియు కళాశాల విద్యార్థినీ విద్యార్థులచే శివనామ సంకీర్తనల గానం అధ్బుతంగా జరిగింది. ఇందులో మహా గణపతే గజాననా, హర హర శంకర, సాంబసదాశివ, కపిల మహాముని పూజిత లింగం, అంబ పరమేశ్వరి, శివాయ పరమేశ్వరాయ మొదలైన భజన సాంప్రదాయ సంకీర్తనలు, నామావళి, గానంచేసి భక్తులను అలరించారు. అనంతరం కళాశాల అధ్యాపకులు శ్రీ హరనాథ్ బృందం “భరతనాట్యం” ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది.
