Site icon Bhakthi TV

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల‌లో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉద‌యం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన పండితులచే చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు తెనాలికి చెందిన శ్రీ విశ్వనాధ శర్మ ధార్మికోపన్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విశాఖపట్నంకు చెందిన శ్రీమతి మాధవి బృందం భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.

అనంత‌రం సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ నాగేశ్వర నాయుడు బృందం అన్నమయ్య సంకీర్తన‌ల‌ను సుమధురంగా గానం చేశారు. అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటలకు శ్రీహరి మహాలింగేశ్వర నృత్య నాటకం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీమతి జ్ఞాన ప్రసూన వీణ వాయిద్యం, ఇతర కళాకారులు భరతనాట్యం ప్రదర్శించారు. శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6 గంటలకు కర్నూలుకు చెందిన శ్రీ గంగాధరం కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి విజయవాడకు చెందిన డాక్టర్ పార్థసారథి కూచిపూడి నృత్య ప్రదర్శన నేత్రపర్వంగా సాగింది.

Share this post with your friends
Exit mobile version