
శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డా. ఆకెళ్ల విభీషణ శర్మ రచించిన శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనే పుస్తకాన్ని శనివారం టీటడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో బ్రహ్మోత్సవాలలోని వాహన సేవల విశిష్టతను వివరించారు. వాహన సేవలతోపాటు ఆలయంలో జరిగే వివిధ బ్రహ్మోత్సవ విశేష పూజలను అందులో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ సత్యనారాయణ, డిపిపి కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
మకర వాహనంపై భక్తులకు దర్శనం..
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం ఉదయం 7 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వాహనసేవలో భక్తజన బృందాల చెక్కభజనలు, కేరళ కళాకారుల వాయద్యాలు ఆకట్టుకున్నాయి.
మకరం గంగాదేవికి నిత్యవాహనం. గంగ పరమశివుని శిరస్సుపై నివసిస్తున్నది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చును. అనంతరం శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
