Site icon Bhakthi TV

హిమాయత్ నగర్ ఎస్వీ టెంపుల్‌లో ఘనంగా గరుడ వాహన సేవ

హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి భక్తజనం మధ్య అత్యంత వైభవంగా గరుడ వాహనం సేవ జరిగింది. ఈ వాహన సేవకు టీటీడీ పాలక మండలి ఛైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు దంపతులు హాజరయ్యారు.
ముందుగా శ్రీవారి ఆలయం వద్దకు వచ్చిన చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు, ఏఈఓ రమేష్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసారు. స్వామి వారి దర్శనాంతరం చైర్మన్ దంపతులకు స్వామివారి పట్టు వస్త్రంతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం గరుడ వాహన సేవలో చైర్మన్ దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ, స్వామివారి బ్రహ్మోత్సవాలకు తనకు ఆహ్వానం లభించడం, టీటీడీ ఛైర్మన్ హోదాలో గరుడ సేవలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఆలయానికి తనకు చాలా అనుబంధం ఉందని, బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసిందన్నారు. భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగైన ఏర్పాట్లు కల్పిస్తామని ఛైర్మన్ మాట్లాడారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ కళాకారుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గరుడ వాహనం సేవలో టీటీడీ అధికారులు, శ్రీవారి సేవకులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version