
తిరుమల శ్రీవాణి నిధులతో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పునరుద్ధరణ, పరిరక్షణకు దేవాదాయశాఖ నడుం బిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేవాలయాల పునరుద్ధరణ పనులపై సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ జె. శ్యామలరావు, దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ వినయ్ చంద్ కలిసి దేవాదాయ శాఖ, టీటీడీ మధ్య పెండింగ్లో ఉన్న సంయుక్త అంశాలపై శనివారం మధ్యాహ్నం తిరుమల అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ కూడా పాల్గొన్నారు. కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధుల విడుదల, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయాల వివరాలు, ఆలయాల పునరుద్ధరణ, పరిరక్షణ, వాటి పురోగతి తదితర ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. టీటీడీ బోర్డు తీర్మానం నం.388 ప్రకారం సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా పురాతన దేవాలయాల పునరుద్ధరణ, కొత్త ఆలయాలు, చిన్న ఆలయాల, భజనమందిరాలు నిర్మాణానికి తోడ్పాటును అందించే ప్రధాన లక్ష్యంతో శ్రీవాణి ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని 2018 ఆగస్టు 28న ఏర్పాటు చేశారు.
