Site icon Bhakthi TV

ద్రాక్షారామం ఆలయ ఈవోపై ప్రభుత్వం వేటు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయ ఈవో పీటీవీవీ సత్యనారాయణమూర్తిని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తంగా 33 అభియోగాలొచ్చాయి. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా గతంలో కొత్త రథం నిర్మాణానికి రూ.26.93 లక్షల విరాళాలు సత్యనారాయణమూర్తి వసూలు చేశారు. అలాగే రూ.18.75 లక్షలను రథం తయారీకి వినియోగించినా కూడా నాణ్యమైన చెక్కను వినియోగించలేదు. కనీసం ఆ విషయంలో శ్రద్ధ చూపలేదు. దీంతో ఆయనపై అభియోగాలు వెల్లువెత్తాయి. ఇలా మొత్తంగా ఈవోపై 33 అభియోగాలు వచ్చాయి.

ద్రాక్షారామ భీమేశ్వరాలయం, కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం, ద్రాక్షారామం గ్రామంలో గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది. పంచారామాలలో ఒకటిగా ఈ ఆలయం వర్థిల్లుతోంది. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామ అని వాడుకలో పిలుస్తారు. ‘ద్రాక్షారామం’ అంటే దక్ష ప్రజాపతి నివాసం. దక్ష ప్రజాపతి శివుని మామ, ‘సతి’ పార్వతీ తండ్రి. ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు.ఈ ఆలయం శివ పంచారామాలలో ఒకటి, 18 శక్తి పీఠాలలో ఒకటి. కనుక ఇది శివ క్షేత్రంగానూ, శక్తి క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది.

Share this post with your friends
Exit mobile version