Site icon Bhakthi TV

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జ‌రిగిన ప‌విత్రోత్స‌వాలు బుధ‌వారం పూర్ణాహుతితో ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి, తోమాల, కొలువు నిర్వహించారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంతో ప‌విత్రోత్స‌వాలు ముగిశాయి. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూప‌రింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్, ఆల‌య అర్చకులు, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీధ‌న‌శేఖర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version