
సింహాచలం అప్పన్న సన్నిధిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. చందనోత్సవం ఘటన మరువక ముందే మరో ప్రమాదం జరుగడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ కోసం ముమ్మర ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి పావంచా వద్ద వేసిన భారీ రేకుల షెడ్ కూలిపోయింది. అయితే ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోల్స్ కింద కాంక్రీట్ వేయకపోవడంతో బరువు ఎక్కువై ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ఈ నెల 9వ తేదీన గిరి ప్రదక్షిణ జరుగనుంది. సింహాద్రి ఆలయంలో జరిగే గిరి ప్రదక్షిణ కోసం స్థానికులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి సైతం భక్తులకు ఇక్కడకు వస్తారు. ఈ క్రమంలోనే గిరి ప్రదక్షిణ కోసం ఆలయ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రేకుల షెడ్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుంది.
