Site icon Bhakthi TV

9 నుంచి ఉపమాక శ్రీ వేంకటేశ్వరాలయంలో వార్షిక కల్యాణోత్సవాలు

విశాఖ జిల్లా ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరాలయంలో మార్చి 9 నుంచి 17వ తేదీ వరకు ఏకాదశి కల్యాణాత్సవాలు వైభ‌వంగా జరగనున్నాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 9వ తేదీ ఉద‌యం 9.45 గంటలకు పెళ్లికావడి ఉత్సవం, సాయంత్రం 5.45 నుండి రాత్రి 7 గంటల వరకు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, రుత్విక్ వ‌రుణం, ర‌క్షాబంధ‌నం, అంకురార్పణ నిర్వహించనున్నారు. రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మార్చి 10వ తేదీ ఉద‌యం 8 నుండి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారికి, శ్రీ సుద‌ర్శ‌న పెరుమాళ్‌కు పల్లకి ఉత్సవం ఘనంగా జరగనుంది.

ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు ద్వజారోహణంతో కల్యాణోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 7.40 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు ఎదురు స‌న్నాహ మ‌హోత్స‌వం ( క‌న్యావ‌రుణ సంవాదం) నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో శ్రీ‌వారు గ‌రుడ వాహ‌నంపై శ్రీ‌దేవి, భూదేవి అమ్మ‌వార్లు శేష త‌ల్ప వాహ‌నంపై భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. మార్చి 11వ తేదీ తెల్ల‌వారుజామున (10వ తేదీ అర్థరాత్రి) 12.30 నుండి ఉద‌యం 3.30 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు కల్యాణోత్సవం వైభ‌వంగా నిర్వహించనున్నారు. రాత్రి 7.40 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారు హంస‌వాహ‌నంపై ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. మార్చి 12వ తేదీ రాత్రి 9 నుండి 10 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారు పుణ్యకోటి వాహనంపై భక్తులను క‌టాక్షించ‌నున్నారు.

మార్చి 13వ తేదీ మ‌ధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు తోట ఉత్సవం, శ్రీ భూ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారు రాజాధిరాజ‌వాహ‌నంపై దర్శనమిస్తారు. అనంత‌రం రాత్రి 7.30 నుండి 10 గంటల వరకు శ్రీవారు గజవాహనంపై భక్తులను క‌టాక్షిస్తారు. మార్చి 14వ తేదీ మ‌ధ్యాహ్నం 2.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు చక్రస్నానం జరగనుంది. రాత్రి 10.30 నుండి అర్థ‌రాత్రి 12 గంటల వరకు రథోత్సవం వైభవంగా జరగనుంది. మార్చి 15వ తేదీ సాయంత్రం 5.45 నుండి 6.30 గంటల వరకు ధ్వజావరోహణం, మార్చి 16, 17వ తేదీలలో రాత్రి 8 నుండి 9 గంటల వరకు పవలింపు సేవ నిర్వహించనున్నారు.

Share this post with your friends
Exit mobile version