పూర్వం కృతవీర్యుడు అనే రాజు తన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించేవాడట. ఆయన రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారట. కృతవీర్యుడు మాత్రం సంతానం లేకపోవడంతో చింతిస్తూ ఉండేవాడట. ఎన్ని సంపదలు ఉన్నా కూడా సంతానం లేకపోవడం ఆయన్ని కలచివేసేదట. ఒకరోజు కృతవీర్యుని బాధను గమనించిన నారద మహర్షి పుత్ర గణపతి వ్రతాన్ని సూచించాడట. నారదుని సూచన మేరకు కృతవీర్యుడు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించి పుత్ర సంతానాన్ని పొందాడు. ఈ వ్రతం ఆచరించిన వారికి పూర్వజన్మలో చేసిన పాపాలను తొలగించిందని ఈ కథ చెబుతుంది.
అసలు ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలో ముందుగా తెలుసుకుందాం. పుత్ర గణపతి వ్రతాన్ని వారంలో ఒక బుధవారం రోజు లేదా శుద్ధ చవితి రోజు కానీ ఆచరించవచ్చు. ఇవి రెండూ కలిసి వచ్చిన రోజు మాత్రం ఫలితం మరింత అద్భుతంగా ఉంటుందట. ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఒక్కసారి చేస్తే సరిపోదు. వీలును బట్టి 5, 7, 9, లేదా 11 బుధవారాలు చేయాల్సి ఉంటుంది. ఈ వ్రతానికి ఉద్యాపన అనేది సాధారణంగా శ్రావణ శుద్ధ చవితి, వినాయక చవితి రోజు చేస్తారు. భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరూ మూడు రుణాలను తీర్చుకోవాలని చెబుతారు. వాటిలో పితృరుణం ఒకటి. పితృరుణం తీరాలంటే సంతానాన్ని కలిగి ఉండటం అవసరం. దీనికి గణపతి అనుగ్రహం ఉండాలని చెబుతారు.
