శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తిక మాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుంటున్నాం. వాటిలో కొన్నింటి గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు ఓ ఆసక్తికర ఆలయం గురించి తెలుసుకుందాం. వాస్తవానికి హరిహరులు ఇద్దరూ ఒకేచోట దర్శనమివ్వడమనేది చాలా అరుదు. అలాంటిది.. త్రిమూర్తులు కలిసి ఒకే పానవట్టంపై దర్శనమిచ్చే క్షేత్రం మరింత అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన క్షేత్రమే త్రయంబకేశ్వర క్షేత్రం. ఇది ఎక్కడుంది? ఎక్కడ లేనిది.. ఇక్కడ మాత్రం త్రిమూర్తులు ఒకే పానవట్టంపై ఎందుకు కొలువయ్యారు? ఈ ఆలయ విశిష్టతలేంటో తెలుసుకుందాం.
ముందుగా త్రయంబకేశ్వర క్షేత్రం ఎక్కడుందో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వర క్షేత్రం ఉంది. ఈ ఆలయం పచ్చని పరిసరాల నడుమ గోదావరి సవ్వడి మధ్య ఉంటుంది. నల్లరాతితో అత్యంత సుందరంగా ఈ త్రయంబకేశ్వరుడి ఆలయాన్ని నిర్మించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది పదవ క్షేత్రం. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే పానవట్టంలో కొలువుదీరడం ఒక విశేషమైతే.. పరమేశ్వరుడితో పాటు బ్రహ్మ, విష్ణుమూర్తి సైతం లింగాకారాల్లో కొలువు దీరడం మరో విశేషం. బ్రహ్మ, విష్ణువులు.. పరమేశ్వరుడితో కలిసి లింగాకారాల్లో కొలువుదీరారు.
