ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అత్యంత శక్తివంతమైనదైన కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుంటున్నాం. కాశీలో మరణానికి చేరువైన వ్యక్తిని పార్వతీదేవి తన ఒడిలోకి తీసుకుంటుందట.. అప్పుడు పరమేశ్వరుడు తారకమంత్రాన్ని బోధిస్తాడని కాశీ ఖండం వివరిస్తోంది. అందుకే ఇక్కడికి మరణించడం కోసం వస్తుంటారు. ఇక్కడ మరణిస్తే మోక్షం ఖాయమని చెబుతారు. అందుకే ఎంతో మంది కాశీలో తమ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని మరణం కోసం ఎదురు చూస్తుంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ కాశీ నగరాన్ని నెలకొల్పాడని పురాణాలు చెబుతున్నాయి. వారణాసి మొత్తం శివుడి సృష్టేనని అంటారు.
కాశీ పట్టణం ఆధ్యాత్మికతకు పుట్టిల్లుగా కనిపిస్తుంది. ఇక్కడ ఎన్నో వేల ఆలయాలుంటాయి. నాగ సాధువుల సంచారం, నిత్య పూజలు, గంగా హారతులతో ప్రతిక్షణం ఆధ్యాత్మికతకు కాశీ అద్దం పడుతూ ఉంటుంది. పరమేశ్వరుడు కాశీ విశ్వనాథుడిగా ఇక్కడ కొలువుదీరగా.. పార్వతీదేవి విశాలాక్ష్మిగా కొలువుదీరింది. పవిత్ర గంగా తీరంలో కొలువైన కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడం అత్యంత పుణ్యదాయకమని చెబుతారు. ఈ ఆలయం పలుమార్లు నవాబుల కాలంలో ధ్వంసమైంది. దీనిని మహారాణి అహల్యాబాయి హోల్కర్ 18వ శతాబ్దంలో పునరుద్దరించారు. కాశీ విశ్వనాథుడి గురించి రామయణ, మహాభారతాలతో పాటు రుగ్వేదం, స్కంద పురాణంలోని కాశీ ఖండం వివరిస్తున్నాయి.
