పంచాక్షరీ మంత్రం గురించి తెలిసిందే. పరమేశ్వరుని ఆరాధానికి ఈ మంత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మంత్రాన్ని శ్రీరాముడు సైతం నిరంతరం జపిస్తూ ఉంటాడని చెబుతారు. ఈ మంత్రానికి ప్రతీకగా పరమేశ్వరుడు పంచముఖాలతో ఓ క్షేత్రంలో దర్శనమిస్తాడు. మరి పరమేశ్వరుడు పంచ ముఖాలతో దర్శనమిచ్చే ఆలయం ఎక్కడుంది? దాని విశేషాలేంటో తెలుసుకుందాం. ‘నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని మన సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. శివుడిని భోళా శంకరుడని.. భక్త సులభుడని చెబుతారు. ఒక చెంబుడు నీళ్లతో స్వామివారిని అభిషేకిస్తే చాలు.. భక్తుల అభీష్టాలన్నీ నెరవేరుతాయట.
శివయ్య పంచ ముఖాలతో దర్శనమిచ్చే క్షేత్రాలు చాలా అరుదని చెప్పాలి. వాటిలో తాళ్లయ్యపాలెం ఒకటి. దాని విశేషాల గురించి తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలోని తాళ్లయ్యపాలెంలో శివుడు పంచ ముఖాలతో భక్తులకు దర్శనమిస్తాడు. కోటి శివలింగాలను రూపొందించి ప్రతిష్టించడం వలన ఇక్కడి స్వామిని ‘కోటి లింగేశ్వర స్వామి’ గా పిలుస్తుంటారు. గర్భాలయంలో స్వామి ఐదు ముఖాలతో దర్శనమిస్తుంటాడు. తాళ్లయ్యపాలెం క్షేత్రంలో శివయ్య ఆలయ ప్రాంగణంలోనే మనకు ప్రత్యంగిరా దేవి సైతం దర్శనమిస్తుంది. ఇక్కడి అమ్మవారు 64 అంశాలతో, 64 త్రిశూలాలతో, అష్ట భైరవులతో కలిసి దర్శనమిస్తుంటుంది.
