శ్రీరాముని పరమ భక్తుడు, అపార శక్తికి ప్రతీక అయిన హనుమంతుడు సాధారణంగా బ్రహ్మచారిగానే పూజింపబడతాడు. కానీ పురాణాలలో దాగి ఉన్న ఒక అపూర్వ గాధ ఆయన సతీసమేతంగా దర్శనమివ్వడానికి కారణం. సూర్యభగవానుని వద్ద వేదాలు, వ్యాకరణాలు అభ్యసించిన హనుమంతుడు, తొమ్మిదవ వ్యాకరణం పూర్తి చేయాలంటే వివాహం అవసరమన్న నియమాన్ని ఎదుర్కొన్నాడు. అప్పుడే సూర్యుని తేజస్సు నుంచి సువర్చల దేవిని సృష్టించి, హనుమంతుడికి వివాహం చేశారు. తేజస్సు రూపమైన సువర్చలతో వివాహమైనప్పటికీ, హనుమంతుడు బ్రహ్మచారి స్వభావాన్నే కొనసాగించాడు. ఈ అరుదైన తత్త్వానికి ప్రతీకగా తెలంగాణలోని ఇల్లందులో శ్రీ సువర్చల సహిత అభయాంజనేయ స్వామి ఆలయం నిలిచింది. ఇక్కడ హనుమంతుడు సతీ సమేతంగా దర్శనమివ్వడం భక్తులకు అపూర్వ అనుభూతిని కలిగిస్తుంది. కుటుంబ శాంతి, దాంపత్య సౌఖ్యం కోరుకునే భక్తులు ఈ ఆలయాన్ని విశేషంగా దర్శిస్తారు.

