మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉన్న పర్లి వైద్యనాథుడి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం సుమారు 3 వేల ఏళ్ల క్రితం నాటిదని చెబుతారు. ఈ ఆలయాన్ని ఒక చిన్న కొండపై రాతితో నిర్మించారు. ఈ ఆలయం దాదాపు 80 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయాన్ని రాణి అహల్యా దేవి హోల్కర్ 18వ శతాబ్దంలో అభివృద్ధి చేసినట్టుగా చెబుతారు. ఈ క్షేత్రం రామాయణ గాథతో ముడిపడి ఉంటుంది. ఈ క్షేత్రంలో కొలువైన శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలనేవి దరిచేరవని చెబుతారు. అలాగే మృత్యు భయాలు సైతం తొలగిపోతాయట.
ఆసక్తికరంగా ఈ క్షేత్ర స్థల పురాణం మురుడేశ్వర్ స్థల పురాణానికి దగ్గరగా ఉంటుంది. రావణాసురుడు అపర శివ భక్తుడన్న విషయం తెలిసిందే. అయితే నిత్య పూజ కోసం రావణుడు శివుని లింగాన్ని లంకకు తీసుకెళ్లాలని భావించాడట. అయితే శివలింగాన్ని పొరపాటున కూడా నేలపై పెట్టకూడదు. కానీ రావణాసురుడు పూజకు వేళవుతుండటంతో శివలింగాన్ని అక్కడే ఉన్న ఒక గోప బాలుడికి ఇచ్చి పట్టుకోమని చెప్పి స్నానానికి వెళ్లాడట. అయితే గోపబాలుడు ఎక్కువ సేపు శివలింగాన్ని పట్టుకుని నిలబడలేక నేల మీద పెట్టేశాడట. ఆ ప్రదేశమే పర్లి అని.. ఆ శివలింగమే వైద్యనాథుడని చెబుతారు.
