పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉన్న గుణిపూడిలో సోమారామం గురించి ఇప్పటికే ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. ఇలాంటి ఆలయం దేశంలో మరెక్కడా లేదని చెబుతరు. దీనికి కారణం శివుడి పైన అన్నపూర్ణమ్మ కొలువుదీరి ఉండటమే. దేశంలో మరెక్కడా కూడా ఇలా శివయ్య తలపై అమ్మవారు కొలువుదీరి ఉండరట. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు కూడా ఉన్నాడు. ఆ క్షేత్ర పాలకుడు మరెవరోకాదు.. జనార్దన స్వామి. ఇక్కడ ప్రతి ఏటా ఎన్నో వివాహాలు జరుగుతుంటాయని కూడా తెలుసుకున్నాం కదా.
ఇక్కడ వివాహం జరిగితే ఆ జంట ఎల్లకాలం సుఖ సంతోషాలతో జీవిస్తుందట. అందుకే ఈ ప్రాంతవాసులంతా ఇక్కడే వివాహాలు చేసుకుంటారు. ఈ క్షేత్రానికి నందీశ్వరాలయం అనే పేరు కూడా ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఈ ఆలయంలో ఐదు నందులు ఉంటాయి. దేవాలయ ముందు భాగంలో రెండు నందులు ఉంటాయి. మూడో నంది ఆలయ ధ్వజస్తంభం దగ్గర ఉంటుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో ఒక నంది.. దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది. ఇలా ఆలయంలో ఐదు నందులు ఉంటాయి కాబట్టి పంచ నందీశ్వర క్షేత్రమని పిలుస్తారు.
