హైదరాబాద్ శివారులోని చందిప్ప గ్రామంలో వెలసిన చందిప్ప మరకత సోమేశ్వర స్వామి ఆలయం భక్తులకు ఆరోగ్య ప్రదాయినిగా పేరుపొందింది. ముదురు ఆకుపచ్చ కాంతితో మెరిసే మరకత శివలింగం దర్శనమే మనసుకు ప్రశాంతిని నింపుతుంది. పశ్చిమ చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు ప్రతిష్ఠించిన ఈ లింగం దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్రను కలిగిఉంది. ముచుకుంద నది తీరాన ఉన్న ఈ క్షేత్రంలో భక్తితో అభిషేకం చేస్తే వ్యాధులు నివృత్తి అవుతాయని స్థానికుల అచంచల విశ్వాసం. ఐదు సోమవారాలు లేదా ఐదు పౌర్ణములు స్వామిని అర్చిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు. 2007 మహాశివరాత్రి రోజున సూర్యకిరణాలు లింగంపై పరావర్తనం కావడంతో ఇది మరకత లింగమని స్పష్టమై, ఆలయ మహిమ మరింత విస్తరించింది. క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు కాపలా కాస్తుండగా… సుబ్రహ్మణ్యుడు నాగరూపంలో సంచరిస్తాడనే ప్రతీతి భక్తుల విశ్వాసాన్ని పెంచుతోంది. శ్రావణం, కార్తికమాసాల్లో ఇక్కడ పూజలు విశేషంగా జరుగుతాయి. మహాశివరాత్రి రోజున జరిగే ఉత్సవాల వైభవం చూసి తీరాల్సిందే. ప్రతీరోజు వందల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఒకసారి ఈ మరకత సోమేశ్వరుని దర్శిస్తే శరీరానికే కాదు, మనసుకూ ఆరోగ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
