తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం భక్తుల కోరికలు తీర్చే మహిమాన్విత దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. హిరణ్యకశ్యపుని సంహరించిన అనంతరం, ప్రహ్లాదుని కోరిక మేరకు నరసింహస్వామి లక్ష్మీదేవి సమేతంగా ఇక్కడ సాత్విక రూపంలో వెలిశారని స్థల పురాణం చెబుతుంది. పరాశర మహర్షి ఘోర తపస్సుకు మెచ్చి స్వామి ఈ కొండపై ఆవిర్భవించినట్టు విశ్వాసం. ఎత్తైన కొండపై ఉత్తరాభిముఖంగా వెలసిన స్వామి ప్రశాంత స్వరూపంలో దర్శనమివ్వడం ఈ క్షేత్రం ప్రత్యేకత. అందుకే ఇక్కడి నరసింహుని ‘సాత్విక నరసింహస్వామి’గా పిలుస్తారు. కొండ దిగువన, పైభాగంలో రెండు ఆలయాలు ఉండటం విశేషం. ప్రకృతి సోయగాల నడుమ, ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనం భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. కోరిన కోర్కెలు తీర్చే కొండ కాబట్టి ఈ ప్రాంతానికి కోరుకొండ అనే పేరు స్థిరపడింది.

