చిత్తూరు జిల్లా, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం గురించి ఆ ప్రాంత వాసులకు మినహా బయటి వారికి చాలా తక్కువగా తెలిసి ఉంటుంది. తిరుపతికి సమీపంలో ఉన్నందున సాధారణంగా తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి దర్శనానికి వచ్చిన యాత్రికులందరూ సమీప ఆలయాల సందర్శనలో భాగంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని సైతం సందర్శించుకుంటూ ఉంటారు. అతి ప్రాచీనమైన ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో నేటి (ఏప్రిల్ 8, బుధవారం) నుంచి వసంతోత్సవాలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో వేణుగోపాల స్వామి ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీకృష్ణుని బాల్యాన్ని వర్ణించే పుణ్యక్షేత్రంగా శ్రీ వేణుగోపా స్వామివారి ఆలయాన్ని పేర్కొంటారు. ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతంలో ఎందుకోగానీ శ్రీకృష్ణుడికి ఆలయాలు తక్కువగానే ఉంటాయి. దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణుడిని ముఖ్యంగా సంతాన వేణుగోపాల స్వామిగా ఆరాధించుకుంటూ ఉంటారు. కృష్ణాజిల్లా హంసలదీవిలో కూడా ఒక పురాతన సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. అలాగే కార్వేటి నగరంలో కూడా పురాతనమైన, ప్రఖ్యాతిగాంచిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ఉంది. ఇది తిరుపతి నుంచి 58 కి.మీ.ల. దూరంలో, పుత్తూరు నుంచి 12 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం శ్రీకృష్ణుని బాల్యాన్ని వర్ణిస్తుందని చెబుతారు.
