పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉన్న గుణిపూడిలో సోమారామం గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకున్నాం కదా. ఇక్కడ శివుడు రంగులు మారుస్తూ ఉంటాడు. ఇక్కడ కొలువుదీరిని సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్ఠించాడని చెబుతారు. అందుకే ఈ దేవాలయంలోని శివుడిని చంద్రుడి పేరు మీదుగా సోమేశ్వరుడు అని పిలుస్తారు. చంద్రుడు ప్రతిష్టించిన శిల కాబట్టి ఇలా రంగులలో మార్పులు కలుగుతున్నాయని చెబుతారు. ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకమని.. ఇలాంటి నిర్మాణం దేశంలో మరెక్కడా లేదని చెప్పుకున్నాం కదా. దాని గురించి తెలుసుకుందాం.
ఆలయం.. రెండు అంతస్తుల్లో నిర్మితమై ఉంది. కింది అంతస్థులో సోమేశ్వరుడు కొలువుదీరగా.. పై అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువుదీరింది. ఇక్కడి అమ్మవారు భక్తులను తన బిడ్డల వలే అనుగ్రహిస్తూ ఉంటుందని చెబుతారు. సోమేశ్వర లింగం గర్భాలయ పై భాగాన రెండవ అంతస్తులో స్వామివారి తల పై భాగాన అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంటుంది. ఇదే సోమారామం ప్రత్యేకత. శివుడు శిరస్సుపై గంగమ్మ ఉంటుంది అంటారు కదా.. ఇక్కడ అన్నపూర్ణా దేవి ఉండటం కూడా ఈశ్వరుడు శిరస్సుపై గంగను ధరించాడు అనడానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు.
