
దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వస్తున్నారు. కొన్ని గంటల పాటు క్యూలో నిలబడి మరీ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ దసరా పండుగ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవిగా దర్శనం ఇచ్చారు. రాజరాజేశ్వరీ దేవిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులతో పాటు భవానీ దీక్షాపరులు పోటెత్తారు. అధికారులు సైతం ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు నిర్వహించారు.
ఒక్క దుర్గమ్మ ఆలయమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ఆలయాల్లోనూ ఇవాళ అమ్మవార్లు రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్నారు. అన్ని ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అలాగే తమ వాహనాలకు సైతం పూజలు నిర్వహిస్తున్నారు. అన్ని ఆలయాల్లోనూ వాహన పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయుధ పూజ కూడా జరుగుతోంది. మరోవైపు జమ్మి చెట్టుకు పూజలను సైతం నిర్వహించుకుంటున్నారు. ఒకరికొకరు జమ్మి ఆకులను మార్చుకుంటున్నారు. ఇలా చేయడం వలన చాలా మంచి జరుగుతుందని నమ్మకం.
