భారతదేశంలో పురాతన ఆలయాలకు కొదువేమీ లేదు. కొన్ని వందల ఏళ్ల నాటి ఆలయాలు కూడా ఏమాత్రం చెక్కుచెదరకుండా నేటికీ నిత్య పూజలతో అలరారుతున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి వరంగల్ జిల్లాలోని అయినవోలు గ్రామంలో వెలిసిన మల్లికార్జున స్వామివారి దేవాలయం. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశాడు. ఈ ఆలయాన్ని కాకతీయులు నిర్మించారు. కాకతీయ మంత్రి అయ్యన్నదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయ్యన్న నిర్మించిన కారణంగానే ఈ ప్రాంత అయ్యన్నవోలుగా పిలవబడుతోంది. వ్యవహారికంలో అయినవోలు అయిపోయింది.
ఇక అయినవోలు మల్లన్నను మైలారు దేవుడని కూడా అంటారు. మల్లన్న స్వామి తలపై కిరీటంతో.. మూతిపై మీసం.. ఒక చేతిలో ఖడ్డం, మరో చేతిలో త్రిశూలం, డమరుకం పట్టుకుని కనిపిస్తూ ఉంటాడు. ఆలయంలో దేవేరులతో మల్లికార్జున స్వామి విగ్రహం ఉంటుంది. దాని ముందు లింగాకారంలో స్వామివారు పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ లింగానికి ప్రతిరోజూ పూజలు, అభిషేకాలు వంటివన్నీ శైవాగమన పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారికి బండారి అంటే పసుపు వాడటమే ఇక్కడ ప్రత్యేకత. స్వామివారి చేతిలో పసుపు ఉంటుంది. దీనిని చాలా పవిత్రంగా భక్తులు భావిస్తారు.