ఇవాళ్టి నుంచి శ్రీ సుందరరాజస్వామి వార్షిక అవతార మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉంటుందీ శ్రీసుందరరాజస్వామివారి ఆలయం. స్వామివారి అవతార మహోత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకూ ఈ అవతార మహోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం శ్రీసుందరరాజస్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, తోమాల సేవ నిర్వహించారు.
అనంతరం ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పాటు మధ్యాహ్నం అభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల వరకు శ్రీ సుందరరాజస్వామివారికి ఊంజల్ సేవ జరుగుతుంది. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహన సేవ నిర్వహిస్తారు. శ్రీసుందరరాజస్వామివారు ఇవాళపెద్దశేష వాహనంపై, రెండో రోజు హనుమంత వాహనం, చివరి రోజు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది.